Description
- సంప్రదాయవాదుల ‘శాస్త్రా’ లేవీ
విజ్ఞాన శాస్త్రాలు కావు!ఆధునిక విజ్ఞాన శాస్త్రం వేరు. మన పూర్వీకుల సంప్రదాయ వాదులు శాస్త్రాలు వేరు. ఈ రెండూ వేర్వేరు.సంప్రదాయవాదులు శాస్త్రాల్లో విషయాలు ఎప్పటికీ మారవు. అవి వేల ఏండ్ల నాటివి. అందులో కాలానుగుణంగా మార్పులు, చేర్పులు ఉండవు.
ఇది నీరు నిలువ ఉన్న నీటి గుంట. ఈ శాస్త్రాల్ని బలపరిచే వారి మెదడ్లు కూడా ఆ విధంగానే ఉంటాయి. ఆ నీటి గుంట ఆవల ఏముందో వారికి తెలియదు. శాస్త్రాన్ని పండితులు బల్లి శాస్త్రం కిందికి దిగజార్చారు.
ఆధునిక విజ్ఞాన శాస్త్రం నిత్యనూతనం. అది జరుగుతున్న పరిశోధనలకు అనుగుణంగా, వెలువడుతున్న నూతనాంశాలకు అనుగుణంగా విషయం మారుతూ ఉంటుంది. ఇది నిరంతరం కదిలిపోయే నీటి ప్రవాహం. అన్ని దశల్ని దాటుకుంటూ ఇది సుదూర తీరాలకు వెళుతుంది. దాహం తీరుస్తుంది. పొలాలకు నీరందిస్తుంది. ఆహ్లాదాన్ని, ఆనందాన్నీ పంచుతుంది. జీవితాన్ని అర్థవంతం చేస్తుంది. అందువల్ల సంప్రదాయ శాస్త్రాన్ని విశ్వసిస్తూ బతకడమా లేక ఆధునిక విజ్ఞాన శాస్త్రాన్ని జీవితంలో ప్రధాన భాగంగా చేసుకోవడమా? అనేది ఎవరికి వారు నిర్ణయించుకోవాల్సిందే
– మాది శాస్త్రీయం అని చెప్పుకోవడం అందరికీ ఒక అలవాటైపోయింది. తమ పవిత్ర గ్రంథాలే శాస్త్రీయమైనవి అంటూ – ఆయా మతాల మత బోధకులు, భక్తులు వాదిస్తుంటారు. బైబిల్, ఖురాన్లు కూడా శాస్త్ర బద్ధమైనవే అని అంటుంటారు.
ఈ జాబితాలో ఇటీవల వాస్తు, జ్యోతిష్యం, ఆక్యుపంక్చర్, హోమియోపతి వంటి వాటిని కూడా పోటీపడి చేరుస్తున్నారు. ఇలాంటి సందర్భంలో శాస్త్రీయమంటే ఏది? అశాస్త్రీయమంటే ఏది? అనేది నిర్ధారించుకోవడం అవసరమవుతోంది. కొందరు సైంటిస్టులే, టెక్నాలజీ నిపుణులే – మూఢనమ్మకాలలో శాస్త్రీయత ఉందని చూపే ప్రయత్నం చేస్తూ… వారు, వారి విలువను పోగొట్టుకుని విమర్శలకు గురి అవుతున్నారు.
ఒకటి మాత్రం నిజం! ‘శాస్త్రీయం’ అనే పదం వాడితే అది గౌరవప్రదంగా మారిపోతుందని అనుకుంటున్నారు. ఇది ఒక రకంగా సైన్సు విజయమే! పురాణ గ్రంథాల విజయం కాదు.
‘ఇవే మా పురాణ గ్రంథాలు అని’ – ఏ వైజ్ఞానికుడూ తమ వైజ్ఞానిక గ్రంథాల గూర్చి పొరపాటున కూడా చెప్పుకోలేదు. మత బోధకులే తమ మత గ్రంథాలు శాస్త్రీయమైనవని చెప్పుకుంటున్నారు. అంటే, విలువైనవి ఏవీ? అన్నది అర్ధం చేసుకోవాలి.
నిస్సందేహంగా వైజ్ఞానిక దృక్పథానిదే విజయం. అది మత గ్రంథాల ముందు సాగిలపడి ఓటమిని ఒప్పుకోలేదు. మత భావన (దైవభావన) మాత్రమే శాస్త్ర దృక్పథం ముందు “తమదీ శాస్త్రీయతే”నని – వివరణలు ఇచ్చుకుంటున్నాయి. అంటే ఒక రకంగా అనుకరిస్తున్నాయి.
ఉన్నత స్థాయిలో ఉన్నవాడు తన కింది స్థాయిలో ఉన్నవాడిని అనుకరించాడు. కింది స్థాయి వాడే ఉన్నంతగా ఉన్నవాడిని అనుకరిస్తాడు. – ఇదీ అలాంటిదే! కొందరు శాస్త్రం, శాస్త్రీయత అనే పదాల్ని పనికిరాని వాటికి ఆపాదించి, విరివిగా వాడినందువల్ల అవి వాటి అర్థాల్ని స్ఫూర్తిని పోగొట్టుకున్నాయి. అందువల్ల సైన్సును మనం తెలుగులో విజ్ఞానశాస్త్రం అని – సైంటిఫిక్ టెంపర్మెంట్ని వైజ్ఞానిక దృక్పథమనీ వాడటం మేలు. దానివల్ల, సంప్రదాయవాదులు చెప్పే శాస్త్రానికి ఆధునిక విజ్ఞాన శాస్త్రానికి తేడా తెలుస్తుంది.
అన్ని మతాలవారు తమ తమ మత గ్రంథాల గూర్చి గొప్పగా చెప్పుకుంటారు. కదా? అవి జన బాహుళ్యంలోకి పోవడానికి ప్రింటింగ్ మిషన్లే కదా ఉపయోగపడ్డాయి.
ప్రింటింగ్ మిషన్లు సైన్సు వల్ల వచ్చినవే! సుప్రభాతాలు దగ్గర్నుండి పవ్వళింపు సేవలదాకా పాటలు, పద్యాలు, భజనలు – అలాగే నమాజులు, ప్రేయర్లు.. అన్ని మతాల ప్రార్థనలు జనానికి వినిపించడానికి మైకులు, లౌడ్ స్పీకర్లే ఉపయోగపడుతున్నాయి. అవన్నీ సైన్సు అందించినవేనని గుర్తుంచుకోవాలి.
పుణ్యస్థలాలకు భక్తులు వెళ్ళి రావడానికి టికెట్లన్నీ ఆన్లైన్ బుక్ అవుతున్నాయి. అవి విజ్ఞాన శాస్త్ర ఫలితమే కదా? విగ్రహాల తయారీ సైన్సు ఫలితమే. ప్రార్థనా స్థలాల్లో నిర్మించిన భవనాలు సైన్సు ఫలితమే. మనిషి ప్రమేయం లేకుండా, అతను సంపాదిస్తూ వచ్చిన విజ్ఞానం లేకుండా ఏ మతమూ నిలబడలేదు.
ప్రచారం కాలేదు. పరిఢవిల్లలేదు.
ఒకప్పటి తాళపత్ర గ్రంథమైనా, నేటి ఇ-బుక్ అయినా, మనిషి వివేకంలోంచి క్రమంగా అభివృద్ధి చెందుతూ వచ్చిన విజ్ఞాన శాస్త్రమే – ఉన్న ఫళంగా ఏ అతీంద్రియ శక్తివల్లనో ఇవన్నీ జరిగాయి.. అనడానికి ఆధారాలే లేవు. “మా విశ్వాసాలే మాకు ముఖ్యం ఏ ఆధారాలు లేకపోయినా మేం విశ్వసిస్తూనే ఉంటాం” అని ఎవరైనా అంటే అది వారి ఇష్టం. కానీ, వారి మానసిక స్థితిపై తప్పక అనుమానం కలుగుతుంది.
సైన్స్ ఎప్పుడూ సైన్స్ లాగా ఉండిపోలేదు. మానవ జీవితంలోని అన్ని రంగాల మీద అది ప్రభావం చూపుతూ వచ్చింది. సామాజిక, రాజకీయ, సాహిత్య, క్రీడా, కళారంగాలలో బలమైన ముద్రవేస్తూ వచ్చింది. జీవితాన్ని వేగవంతమే కాదు, అర్థవంతం చేసింది కూడా!
దుర్వినియోగం చేసినప్పుడు దుష్ఫలితాల నిచ్చింది. కాని, మనిషి దాన్ని సరిదిద్దుకునే ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. మనిషి రేపటి ప్రయాణానికి సైన్సు సర్వదా సహాయకారి అయ్యింది. ఎప్పుడో నలభైయేండ్ల కింద విన్న మధురగీతం మళ్ళీ ఇప్పుడు ఆస్వాదించాలనుకుంటే – వినడానికి వీలవుతుంది. ఇంట్లో కూర్చుని విదేశాలలో జరుగుతున్న క్రికెట్ మ్యాచ్ చూడగలుగుతున్నాం. మనిషి ఆరోగ్యం కాపాడడానికి ఎక్కడ ఏ దేశంలో ఏ శాస్త్రవేత్త మందు కనిపెట్టినా, అది అనతికాలంలో మనకు ఇక్కడ లభిస్తోంది. ఇవన్నీ ఆధ్యాత్మిక శక్తివల్లనో, దైవానుగ్రహం వల్లనో, జరగడం లేదని దయచేసి జనం గ్రహించుకుంటూ ఉండాలి. “మేం గ్రహించుకోం” అని ఎవరైనా అంటే, అది వారి ఇష్టం. ఇంగిత జ్ఞానం లేని వారి జాబితాలో వారు చేరిపోతారు. వారిని ఎవరూ కాపాడలేరు.
కుల, మత, ప్రాంతీయ భేదాలు తగ్గించడానికి విజ్ఞాన శాస్త్రం నిరంతరం కృషి చేస్తూనే వచ్చింది. అది ఎలాగా? అని అంటారేమో – బస్సులు, రైళ్ళు, విమానాలు అన్నీ సైన్సు ఫలితాలే కదా? వాటిలో మనుషులంతా ఏ బేధాలు లేకుండా ప్రయాణాలు చేస్తున్నారు. కదా? ఒక దళితుణ్ణి తన ఇంటి ప్రహరీగోడ బయట నిలబెట్టిన ఛాందసుడు నోరు మూసుకుని ప్రయాణాల్లో పక్క సీటు ఇవ్వాల్సిందే. హోటళ్ళలో ఎవరు వంట చేస్తున్నారో తెలియదు. పక్కన కూర్చుని తిని వెళుతున్నది ఎవరో తెలియదు. విజ్ఞాన శాస్త్రం అందిస్తున్న ఆధునికత, నాగరికత, మనుషులందరినీ ఒక్కటిగా ఒకచోట కలపడానికి ప్రయత్నిస్తూనే ఉంది.
కానీ, సమాజంలోని కొంతమంది కుటిల మనస్కుల వల్ల పూర్తి ఫలితాలు లభించడం లేదు. అమెరికాలో జాత్యహంకారం బుసలు కొడుతూ ఉంటే, ఇక్కడ మన దేశంలో కులమతాల దురహంకారం రొమ్ము విరుచుకు తిరుగుతోంది. ఏమైనా ఈ దేశంలో అన్ని మతాల మత గురువులు, మత ప్రబోధకులు, రాజకీయ నాయకులు విజ్ఞానశాస్త్రం
ఇచ్చిన నీడలో తలదాచుకుంటున్నారు.
అయితే ఆ విషయం ధైర్యంగా ఒప్పుకునే నిజాయితీ వారికి లేదు. ఒప్పుకుంటే తమకు తాము కల్పించుకున్న పవిత్రత – మహిమ – గౌరవం – విలువ అన్నీ కుప్పకూలిపోతాయని వారి భయం. ఆ భయాన్ని అధిగమించి వారు నిజాయితీగా బయటికొస్తే, వారి విలువ ఎన్నో రెట్లు పెరుగుతుంది. కానీ, వారికి అది అక్కరలేదు. భ్రమల్లో బతకడమే వారికి ఇష్టం! కొందరు మూఢ భక్తులు, అనుచరులు తమ చుట్టూ ఉంటే చాలు, ప్రపంచమే తమ చుట్టూ ఉందని సంతృప్తి పడుతుంటారు.
విజ్ఞాన శాస్త్రమంటే ఏముంది, కేవలం సాంకేతిక పరిజ్ఞానమే కదా? అని కొందరు దాన్ని తేలికగా తీసివేయాలని చూస్తారు. నిజమే! విజ్ఞానమే తరువాత సాంకేతిక పరిజ్ఞానంగా మారుతుంది. అందుకే శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు కలిసి చాలా చాలా శ్రమించాల్సి వస్తుంది.
ఇక్కడే రుషులు, ఆధ్యాత్మిక వేత్తలు, మత గురువులు అందరూ ఘోరంగా విఫలమవుతూ వచ్చారు. సైన్సు, టెక్నాలజీగా మారి ప్రజలకు ఉపయోగపడ్డట్టు, ఈ ఆధ్యాత్మికవేత్తల బోధనలు సామాన్యుడి దైనందిన జీవితంలో ఉపయోగపడటం లేదు. వీరి అంతర్గత ఆత్మశక్తి వల్ల, తపోశక్తి వల్ల, ఆధ్యాత్మిక శక్తి వల్ల, దైవప్రార్థనల వల్ల, నమాజులు, ప్రేయర్ల వల్ల చిన్న గుండు సూదిని కూడా కదిలించలేక పోతున్నారు. శతాబ్దాల కాలంలో వారి వల్ల మానవులకు ఉపయోగపడే పనిఏమైనా జరిగిందా? జరగలేదు కదా?
ఒక సన్యాసి మరికొందరు సన్యాసులను తయారుచేసినట్టు – ఒక మానసిక బలహీనుడు మరికొంత మంది మానసిక బలహీనుల్ని తయారుచేయడం జరిగింది. జరుగుతూ ఉంది. గురువు భ్రమల్లో ఉంటూ తన శిష్యులను కూడా భ్రమల్లో ఉండమని ఉద్భోదిస్తాడు తప్ప – నికరంగా సమాజానికి జరిగిన మేలు ఏముంటుంది?
విజ్ఞానం అంటే జ్ఞానాన్వేషణ. అది మొదట ఒక సిద్ధాంతంగా రూపుదిద్దుకుంటుంది. ఆ సిద్ధాంతాన్ని ఆచరణలోకి మారిస్తే అది సాంకేతిక పరిజ్ఞానం అవుతుంది. ఆ రకంగా మానవ జీవన పరిణామ దశ నుంచి మనిషి విజ్ఞాన శాస్త్రాన్ని – సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతం చేసుకుంటూ వచ్చాడు. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాడు. దాని ద్వారానే ఆధునికతను సంతరించుకుంటూ నిరంతరం ప్రగతి పథంలోకి ప్రయాణిస్తూనే ఉన్నాడు.
కంటికి కనబడని సూక్ష్మజీవుల ఉనికిని కనుక్కోగలగడమైనా, గ్రహాంతర యానానికి పూనుకోవడమైనా వివేకవంతులైన శాస్త్రవేత్తలు స్పృహలో ఉండి సాధిస్తున్నవే. ధ్యానంలో మునిగినవాళ్ళు, సమాధిలోకి పోయిన వాళ్ళు సమాజానికి కాదు కదా, కనీసం తమకు తాము కూడా ఏమీ చేసుకోలేక పోయారు.
ఊర్థ్వలోకం కోసం, పుణ్యం కోసం, మోక్షం కోసం వెంపర్లాడుతున్న వారికి – చుట్టూ ఉన్న ప్రపంచం కనబడదు. అందులో ఉన్న మంచి గానీ, మానవత్వం గానీ, సేవాభావన గానీ కనపడదు. నూతన ఆవిష్కరణల కోసం పడే తపన వారిలో ఉండదు. కొత్త మార్గాల్ని అన్వేషించాలన్న ఉత్సుకత ఉండదు.
వేల ఏండ్ల నాడు పూర్వీకులు నిర్ణయించిన మార్గదర్శకాలే వారికి ఆదర్శం. ఎవరైనా సరే, పుచ్చిపోయిన కర్రపట్టుకుని ఎవరి మీదా అజమాయిషీ చేయలేరు కదా? కానీ, వారు ఆ విషయం గ్రహించుకోరు. వేల ఏండ్ల నాటి సంప్రదాయపు కర్రలతో ఇటు సమకాలీన, అటు భవిష్యత్ తరాల్ని అజమాయిషీ చేయాలనుకుంటారు.
వారి ఆలోచనలు ఎక్స్పైరీ అయిపోయిన మందుల్లాంటివని, అవి సమాజానికి హాని చేస్తాయని గ్రహించుకోరు. విజ్ఞాన శాస్త్రం ఎప్పుడూ నిత్య నూతనం గనుక, నిరంతరం మారుతూ తనను తాను అప్డేట్ చేసుకుంటుంది. అందువల్ల అది ఎక్స్పైర్ అయ్యే ప్రసక్తే ఉండదు.
ఇప్పుడు మనల్ని మనం ఒక ప్రశ్న వేసుకోవాలి. కాలం చెల్లిన విధానాల్ని, విలువల్ని పట్టుకుని వ్రేలాడుదామా? లేక కాలంతో పాటు వేగంగా ముందుకు కదులుదామా? మరొక ముఖ్య విషయమేమంటే సైన్సు అనేది ఏదో ఒక రంగానికి చెందిన ‘విజ్ఞాన శాస్త్రం’ మాత్రమే కాదు. సైన్సు అంటే సత్యాన్వేషణలో ఉపయోగించే ఒక పరికరం! అయితే దాన్ని ఉపయోగించే తీరును బట్టే మళ్ళీ.. ఫలితాలుంటాయి.
హెచ్. నరసింహయ్య బెంగుళూరు విశ్వవిద్యాలయానికి వైస్ ఛాన్సలర్గా ఉన్నప్పుడు వైజ్ఞానిక దృక్పథం గురించి డిగ్రీస్థాయి విద్యార్థులకు ఒక పాఠ్యగ్రంథం ఏర్పాటు చేశారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు వైజ్ఞానిక స్పృహ కలిగి ఉంటే, అది పిల్లలకు లాభదాయకమౌతుంది. అలా అలా రాబోయే తరాలు లాభపడతాయి. వైజ్ఞానిక దృక్పథం గురించి మనం మన రాజ్యాంగంలో పొందుపర్చుకున్న అంశాన్ని నిరంతరం గుర్తుంచుకుంటూ, భావితరాల్ని తీర్చిదిద్దుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిమీద ఉంది. అలాగే Change is the Phenominon of Life అనేది కూడా గుర్తుంచుకోవాలి.
________________________________
3. భారతీయ వైజ్ఞానిక రంగంలో మఫిబ్రవరి 28ని భారతదేశ ప్రజలందరూ తప్పక గుర్తుంచుకోవాల్సిన రోజు. 1930లో భారతీయ శాస్త్రవేత్త సి.వి. రామన్, నోబెల్ బహుమతిని సాధించింది.
ఈ రోజునే ఆ సందర్భాన్ని స్మరించుకోవడానికి మనం ప్రతి సంవత్సరం దేశంలో ఫిబ్రవరి 28ని జాతీయ వైజ్ఞానిక దినోత్సవం (నేషనల్ సైన్స్ డే)గా జరుపుకుంటున్నాం.
Reviews
There are no reviews yet.